Wednesday, February 28, 2018

శివా రెడ్డి గారితో బ్రెజిల్ ముచ్చట్లు

శివా రెడ్డి గారు బ్రెజిల్ గారు భారత దేశం తరపున మరో ఇద్దరుకవులతో కలిసి బ్రెజిల్ ప్రయాణం చేసోచ్చారు. ఒక కవిగా ఆయన అనుభవాలు . ఆయన యాత్ర విశేషాలు ఆయనతో సాగిన మాటా మంతి ఉన్నది ఉన్నట్టుగా ..

మెర్సీ : సర్ ఇంతకు ముందు చాల ప్రయాణాలు చేసారు కదా వాటన్నిటి కన్నా ఈ ప్రయాణం
ఎందుకు ప్రత్యేకమైనది ?

శివారెడ్డి సర్ : అమెరికా పోయా. ఇంగ్లాడ్ పోయా . జర్మనీ పోయా. కువైట్ పోయా.
వివిధ దేశాలకు వెళ్ళొచ్చా కాని ఈ ట్రిప్ చాలా విశిష్టమైనది. ఎందుకంటే ఒకటే ఈ వయసులో
26 గంటలు విమాన ప్రయాణం చేయడం. రెండు ఒక దేశం నుంచి ముగ్గురు కవులను
ఎక్స్లూసివ్ గా ఇంకో దేశం పంపించడం. ఇది ఒక దేశ సాహిత్యకారులని ఇంకో దేశానికి పంపడం.
వాళ్ల దేశం నుంచి మళ్ళీ మన దేశానికి రావడం ద్వారా జరిగే “కల్చరల్ ఎక్స్చేంజ్ “అనుకోవాలి.
ఎలా అయితే భారతీయ కవులంగా మేము వెళ్లి కవితలు చదివి బ్రెజిల్ తిరిగొచ్చామో అలాగే వచ్చే
రోజుల్లో బ్రెజిల్ నుంచి ఇంకో కవిత్వ బృందం భారతదేశం వచ్చి తమ కవితలు చదవడం
భారతదేశాన్ని చూసి వెళ్ళడం జరుగుతుంది.


మెర్సీ : ఈ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రయాణ భాద్యతలు , రూపకల్పన ఎవరిది ?
ఎవరెవరు పాలు పంచుకున్నారు ?

శివారెడ్డి సర్ : సాహిత్య అకాడెమి , మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు మమ్మల్ని ఇక్కడ నుంచి పంపారు.
బ్రెజిల్ లో వాళ్ళ ఎంబసి వాళ్ళు మా వసతి భోజన సదుపాయాలన్నీ చూసుకున్నారు. మేము
వెళ్లకముందే కవితలు పంపమన్నారు. మా బృందంలో ముగ్గురు కవులం తలా ఆరు ఏడూ కవితల్ని
వాళ్లకు పంపాం. అవి పోర్చుగీసులోకి అనువాదం చేయబడ్డాయి. బ్రెజిల్ రాజబాష పోర్చుగీసు. వాళ్ళది
పోర్చుగీసు కాలని. మనది బ్రిటిష్ కాలని. అందుకని వాళ్లకి ఇంగ్లీషు భాష లాంటివి రావు.


మెర్సీ : ఒక సాధారణ వ్యక్తిగా లేక కవిగా మీరు బ్రెజిల్ ని ఎలా చూసారు ?

శివారెడ్డి సర్ : బ్రెజిల్ మనకన్నా చాలా పెద్ద దేశం. మన కన్నా ముందు స్వాతంత్ర్యం
సాధించుకున్న దేశం. మనకు౦ 170 ఏళ్ళ కిందే స్వాతంత్ర్యం వచ్చింది. కల్చరల్ హెరిటేజ్
ఉన్న దేశం. దానిదైన ఉద్దేశానికి దానిదైన ఒక కల్చర్ దానిదైన ఒక అభివ్యక్తి , వ్యక్తిత్వం ఉంది.
మనిషికి ఉన్నట్టుగానే ప్రతిదేశానికి దానిదైన స్వభావము వ్యక్తిత్వమూ ఉంటుంది.
బ్రెజిల్ కూడా అంతే . బ్రెజిల్ అనగానే మనకు గుర్తొచ్చేది ఫుట్ బాల్ గేం , ఫుట్ బాల్ టీం ,
ఫుట్ బాల్ ప్లేయర్ పేలే, అలాగే కాఫీ గుర్తొస్తుంది.అంత అధ్బుతమైన కాఫీ ఇంకెక్కడా తాగలేదు.

మెర్సీ : మీ బృందంలో ఎవరెవరు ఉన్నారు ? ఏ ఏ ప్రాంతానికి చెందిన కవులు
ఇక్కడ భారతదేశం నుంచి బ్రెజిల్ వెళ్ళారు ?

శివారెడ్డి సర్ : తెలుగు కవిగా నేను , కాశ్మీరీ కవి షఫీ షౌక్ , ఒరియా కవయిత్రి మోనాలిసా.
మమ్మల్ని ముగ్గురిని బ్రెజిల్ పర్యటనకి గాను ఎంపిక చేసి పంపించారు. ధిల్లీ వెళ్లి ధిల్లీ నుంచి
దుబాయ్ వెళ్లి అక్కడ నుంచి బ్రెజిల్ వెళ్లాం. బ్రెజిల్ రాజధాని అయిన  బ్రెసిలియాకి వెళ్లాం.
ఇలాంటి ప్రయాణాలు ఊహాశక్తిని ఇస్తాయి. అవి రాయడానికి ప్రేరణనిస్తాయి.

మెర్సీ : బ్రెజిల్ లో ఏ ఏ ప్రాంతాల్లో మీరు మీ కవితల్ని చదివి వినిపించారు. ?

శివారెడ్డి సర్ : బ్రెజిల్ లో మూడు నగరాలు తిరిగాం. ఒకటి బ్రెసిలియా, రెండోది సాపౌలో,
మూడోది రియో. ఈ మూడు పట్టణాలలో కవిత్వ పఠనం చేశాం. అప్పటికీ మా కవితలు
పోర్చుగీసులోకి అనువాదం అయి ఉండడం వల్ల అప్పటికప్పుడు ఏదైనా మాట్లాడితే
వెంటనే దాన్ని పోర్చుగీసు భాషలోకి అనువదించి చెప్పడానికి ఒక అనువాదకుడు దాన్ని
పోర్చుగీసులో చెప్పేవాడు. నేను ఓ కవితని తెలుగులో చదివాక మిగితావి మిగిలినవి
ఇంగ్లీషులో చదివా వాటికి సమాంతరంగా అనువాదాలు చదివారు

మెర్సీ : మీరు అక్కడున్నప్పుడు మిమ్మల్ని కవిత్వం రాసేట్టుగా ఏదైనా అంశాలు
ప్రేరేపించాయి ?
శివారెడ్డి సర్ : మేము అక్కడ ఉన్నప్పుడే వాళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి.
ఆ వేడుకలపై నేను ఓ కవిత రాసాను. షఫీ షౌక్ కూడ కవిత రాసాడు.
నేను మొత్తం ఎనిమిది కవితల వరకు రాసాను. ఇంగ్లీషులో కూడా కవితలు రాసాను.

మెర్సీ : మీ ముందటి అంతర్జాతీయ ప్రయాణమప్పుడు ఎప్పుడైనా ఇలాగే కవిత్వం
రాసారా ?
శివారెడ్డి సర్ : నేను అమెరికా వెళ్ళినప్పుడు ఒక్క కవితా రాయలేదు.
జర్మనీ వెళ్ళినప్పుడు నెల రోజులు ఉండొచ్చా ఒక్క కవితా రాయలేక పోయా.
అలాగే కువైట్ వెళ్ళినప్పుడు కూడా . ఒక్క కవిత రాయలేకపోయాను. ఇంగ్లాడు వెళ్ళినప్పుడు
ఒక పదికవితల వరకు రాసాను. మళ్ళీ బ్రెజిల్ వెళ్ళినప్పుడు రాసాను.

మెర్సీ : మీరు పర్యటించిన దేశాలలో కొన్ని దేశాలకు వెళ్ళినప్పుడు రాయలేక పోవడం

బ్రెజిల్ ఇంగ్లాడ్ వెళ్ళినప్పుడు రాయడం వెనక కారణం ఏమై ఉండొచ్చు ?
శివారెడ్డి సర్ : కొత్త మనుషులు , కొత్త ప్రాంతం , కొత్త వాతావరణం రాయడానికి ఓ కవికి కొత్త

ఊహా శక్తిని ఇస్తాయి. అవి రాయడానికి ప్రేరణనిస్తాయి. ఎప్పుడైతే కవి ఆ వాతావరణంతో

తెలియకుండా మమైకం అవుతాడో అప్పుడే కవిత్వాన్ని పలకగలడు. అందుకు కవి మానసిక

స్థితి కూడా అనుకూలంగా ఉండాలి.


మెర్సీ : బ్రెజిల్ లో  మీరెక్కడెక్కడ కవితలు చదివారు ?
శివారెడ్డి సర్ : నేను బ్రెజిల్ యూనివర్సిటీలో చదివాను.
 బ్రెజిల్ రాయబార కార్యాలయంలో రెండో రోజు సాయంత్రం చదివాను.
రాజధాని  బ్రెసిలియాలోని ఒక యూనివర్సిటీలో మొదటి రోజు చదివాను.
అక్కడి నుంచి సాఫౌలో కెళ్ళాం. సాఫౌలో లో నే ప్రపంచ ప్రసిద్ది గాంచిన అరెనా డే సాఫౌలో
అనే ఫుట్ బాల్ స్టేడియం ఉంది.  అరవైదు వేల  ఎనిమిది వందల మంది ప్రేక్షకులు కూర్చునే
స్టేడియం. అదీ గాక ఇరవై వేల తాత్కాలిక సీట్లు అదనం. ఇంకా అక్కడ గ్రాఫిటీ చేసిన
గోడలతో పెద్ద వీది ఉంది. అక్కడ ఆ బొమ్మలు యుద్ధానికి సంబంధించి ఆ విధ్వంసానికి
సంబంధించిన చిత్రాలు నన్నెంతగానో ఆకట్టుకున్నాయి. యుద్ధాలు లేని శాంతియుత
ప్రపంచాన్ని కాంక్షిస్తున్నట్టు ఉంటాయి ఆ గ్రాఫిటీ చిత్రాలు. ప్రతి మూడు నెలలకు
ఒకసారి కొత్తగా మళ్ళీ వాటిపై చిత్రిస్తూనే ఉంటారట.

సాఫౌలో వెళ్ళిన వాళ్ళు స్టేడియం , గ్రాఫిటీ వేసిన గోడలు చూడకుండా వెళ్లరు.
సాఫౌలోలో రెండు స్థలాల్లో కవితా పఠనం చేశాం. సాఫౌలో లోని  “ పెద్ద బుక్ స్టోర్స్  చైన్ “ ఉంది.
అది ఓ పెద్ద పుస్తకాల వీధి. దాని పేరు “ లివరేరియా కాల్చుర “ ( Livararia Cultura )
అక్కడా రెండు చోట్ల వేదికలా వేసి పుస్తకాలు కొనడానికి వచ్చే వాళ్ళు వినేలా
కవితా పఠనం ఏర్పాటు చేసారు.   

ఫుట్ బాల్ మ్యూజియం చూసాం. ఫుట్ బాల్ ఆట ఎలా పుట్టింది ఎలా పరిణామం
చెందుతూ వస్తుంది అని అక్కడ ఒక షో వేసారు. అక్కడ నుంచి రియోలో కూడా ఫిలాసఫీ
డిపార్ట్మెంట్ లో సెలెక్టెడ్ ఆడియన్స్ మధ్య కవితా పఠనం చేసాం.  

మెర్సీ : సాఫౌలో లో మాట్లాడారన్నారు కదా ? ఏ విషయాలు మాట్లాడారు?
శివారెడ్డి సర్ : సాఫౌలో లో నాకు పది నిమిషాలు మాట్లాడే అవకాశం లభించింది.
బ్రెజిల్ భారత దేశానికి మధ్య ఉన్న సామ్యం గురించి, రెండు దేశాలు కలోనియల్ గా
వ్యత్యాసాలున్న దేశాలు. వాళ్ళది ముందుగా చెప్పినట్టు పోర్చుగీస్ కాలనీ, మనది బ్రిటిష్ కాలనీ.
వాళ్లకి ముందు స్వాతంత్ర్యం వచ్చింది. మనకన్నా వంద సంవత్సరాల ముందే
వాళ్లకి స్వాతంత్యం వచ్చింది. వాళ్ళది కూడా రిచ్ కల్చర్ , సామ్యవాద దేశం.
99% మంది పోర్చుగీస్ మాట్లాడేవాళ్ళే. మూడు పట్టణాల్లో కవితలు చదవడం.
వాళ్లకు మనకి ఉన్న పోలికలు బేధాలు వివరించడం. భారత దేశం యొక్క సారాంశాన్ని
కూడా వల్ల ముందు వ్యక్త పర్చడం. ఇన్ని కులాలు ఇన్ని మతాలూ, భాషలూ,
వివిధ ఐడెంటిటీలు, అభిప్రాయాలు  కమ్యూనిటీలుగా ఉన్న ఈ దేశం ఎలా ఐక్యంగా
నిలబడి ఉండగలుగుతుంది అనేది మాట్లాడను. గ్రేట్ డైవర్సిటీ ఉండి కూడా యూనిటి
ఎలా కలిగిఉంది. అలాగే తెలుగు సాహిత్యంలో వచ్చిన ట్రెండ్స్. గురజాడ నుంచి
శ్రీ శ్రీ వరకు , ఉనికికి సంభందించిన సాహిత్య ధోరణుల గురించి మాట్లాడాను.
1986 తరువాత దళితవాదం, స్త్రీ వాదం, ప్రాంతీయ వాదం,
వీటిని ప్రాతిపదికగా చేసుకొని ఎంతటి గొప్ప సాహిత్యం వచ్చిందన్న విషయాలు మాట్లాడను.

మెర్సీ : బ్రెజిల్ లో  మీకు చూడగానే  నచ్చిన ప్రదేశాలు , అబ్బురపరిచిన సన్నివేశాలు
ఏమైనా ఉన్నాయా సర్ ?
శివారెడ్డి సర్ : బ్రెజిల్ వెళ్ళే ముందు బ్రెజిల్ సాహిత్యం గురించి కొంత చదివి వెళ్లాను.  
మనకి లాగే వాళ్ళకూ జాతీయకవి ఉన్నారు. కార్లోస్ ద్రుమ్మండ్ డే అన్ద్రాడే
( Carlos Drummond de Andrade ). మనకి శ్రీ శ్రీ ఎలాగో వాళ్లకి అన్ద్రాడే అలాగ.
రియోలో అట్లాంటిక్ సముద్రానికి ఉన్న బీచ్ లలో ఎక్కువ మందిని ఆకర్షించే
ఒక బీచ్ ఉంది.  అది “ కోపకబాన “ ( Copacabana ) బీచ్. ఆ బీచ్ అంత “ఫుల్ అఫ్ లైఫ్ “.
ఆ బీచ్ లోనే కార్లోస్ ద్రుమ్మండ్ డే అన్ద్రాడే విగ్రహం బీచ్ బెంచీ మీద కూర్చున్నట్టు
ఉంటుంది. మనకు లాగ చచ్చిపోయిన వాళ్ళని ట్యాంక్ బ్యాండ్ మీదో మూసి నది పక్కనో
కాదు. అక్కడ ఆ కవి కూర్చుని ఆలోచిస్తూ మనలని పలకరిస్తున్నట్టు జీవించి ఉంటున్న
వాడిలాగే ఉంటాడు. ఆయనతో ఫోటో తీసుకున్నా.
అక్కడే రియో లో Rio de Janeiro అనే”  క్రైస్ట్ ది రిడీమర్ “ విగ్రహం ఉంది. అది 98 అడుగుల
ఎత్తున్న విగ్రహం. చూడగానే ఆకట్టుకునేట్టు బీచ్ పక్కన ఎత్తైన ఒంటిశిల కొండ పైన
చెక్కబడింది. అసలు అక్కడ అలా చెక్కడం పెద్ద సాహసం. ఆ శిల్పి ని మెచ్చుకోవాల్సిందే.
అక్కడ జాతరలా ఉంటుంది. అది చూడాల్సిందే అక్కడికి వెళితే.
నాకు ఒక మిగిలిపోయిన కోరికగా అనిపించింది మాత్రం అక్కడ గ్రామాలని చూడలేకపోవడం.
అక్కడ గ్రామాలు ఎలా ఉన్నాయో చూడాలన్న కోరిక ఉండిపోయింది. ఎందుకంటే బ్రెజిల్
అనే దేశం పాలకీ , పాడికీ గొప్ప పేరున్న దేశం. అయితే అది ఒక పది రోజుల ట్రిప్ మాత్రం
అవడం వల్ల అన్నీ చూట్టం కుదరలేదు.

మెర్సీ : సర్ ఇలాంటి ప్రయాణాల వల్ల ఏంటి లాభం ?
శివారెడ్డి సర్ : ఏ కొత్త ప్రాంతానికైనా వెళ్ళినా అది ఒక లాంటి జ్ఞాన సముపార్జన.
అది నైసర్గికమైనది కావచ్చు. భౌగోళికమైనది కావచ్చు. సాహిత్యపరమైనది కావచ్చు.
ఇవన్నీ మనకూ వాళ్ళకున్న సామ్యాన్ని స్వారూప్యాన్ని తెలియజేస్తాయి. వాళ్లకతో మనకున్న
గొప్ప సాహిత్య సంపదల్ని పంచుకోడానికి   వీలవుతుంది. కవి ప్రయాణాల ద్వారా తన
దృష్టిని ఇంకా తేట పరుచుకోగలడు. సాహిత్య అకాడెమీ వాళ్లు కూడా మందలా మమ్మల్ని
తోలకుండా ముగ్గురిని పంపడం ద్వారా కొంత ప్రశాంతంగా అక్కడి వాతావరణాన్ని
ప్రదేశాల్ని అర్ధం చేసుకుని కొంత చిక్కటి అనుభవాల్ని పొందేందుకు అవకాశం కలిగింది.

మెర్సీ : చివరిగా మీ ఈ బ్రెజిల్ యాత్ర గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ?
శివారెడ్డి సర్ : వాళ్లకు సాహిత్యంలో నోబుల్ ప్రైజ్ రాలేదు. వాళ్ళ సాహిత్యం అందరికీ
తెలియకపోవడానికి వాళ్ళ సాహిత్యం వేరే భాషల్లోకి వెళ్లకపోవటం కూడా ఒక కారణం
అయ్యుంటుంది. మేమైనా కేవలం బయట బయట చూసాం తప్ప అంతగా అంతర్వీక్షణం
చేయగలిగే వీలు చెక్కలేదు. అక్కడి ప్రజలు చాలా స్నేహపూర్వంగా ఉన్నారు. అమెరికాలా
కాకుండా బ్రెజిల్ శాంతిని కోరుకునే దేశం. అమెరికా దురాక్రమణ చేసే దేశంగా కనిపిస్తే.
బ్రెజిల్ కి దానికై దానికి స్వంత నాగరికత సంస్కృతి ప్రత్యేకత ఉన్నాయి దానికి
స్వాతంత్రోద్యమ స్ట్రగల్ ఉంది.

“life is short knowledge is infinity “ అని యూలిసిస్ ( ulysis )తన పోయెంలో అన్నట్టు,
తిరగటం వల్ల వచ్చే జ్ఞానం గొప్పగా ఉంటుంది. చదవడటం కన్నా చూడటం వల్ల
నాలెడ్జ్ ఎక్కువగా వస్తుంది.





























Monday, February 26, 2018

రన్ లోల రన్

పరుగు. గడియారం .కాలం .జీవితం.  నిమిషం.. నిమిషం.. ఏదో తెలియని ఉత్కంట. ఇరవై నిమిషాలు ప్రియుడి ప్రాణం. లోల పరుగు. "మని' కోసం పరుగు.
మని , లోల ప్రియుడు.

సమయం , గమ్యం. లక్ష్యం గమనం. ప్రణాళికలు పరుగులు. పర్సెప్షన్స్. పర్వర్శన్స్. లోల పరుగు.మని .. జీవితం..  కాలం ముగింపు. కాలం ఆట .. ఆట ముగింపు కాదు. 20 నిమిషాల్లో లోల .. చేయగలిగేది ఏంటి ? పరుగు చెప్పేదేంటి ?

నిన్న సినీవారంలో ప్రదర్శింప బడ్డ సినిమా " రన్ లోల రన్ ".

ఒక ఎనభై నిమిషాల  సినిమాలో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు అని వెతికితే ముంజేతికి అద్దం కట్టి మిమ్మల్ని మీరూ ఒకసారి చూసుకోండి అన్నట్టు ఉంటుంది సినిమా.

చిన్న చిన్న స్మగ్లింగ్ వ్యాపారం చేసే మని వజ్రాలను చేరవేసి 100, 000 /- DM లక్ష డచ్ మార్క్ లను తీసుకుని డబ్బులు తిరిగిచ్చే క్రమంలో ట్రైన్లో పోలీసు లను చూసి కంగారుతో డబ్బు సంచి మర్చిపోయి దిగేస్తాడు. అప్పుడు అందులో ఎక్కినా బిచ్చగాడు ఆ సంచి ని చూసి అందులో డబ్బుల్ని చూసి తరువాతి స్టేషన్లో దిగిపోతాడు. ఆ లక్ష మార్క్స్ ఇవ్వకపోతే ఆ ముఠా మని ప్రాణం తీసేయడం ఖాయం. మనికున్న ఒకే ఒక ఆధారం లోల . లోల తన ప్రేమికురాలు. మని భయాన్ని అర్ధం చేసుకుంటుంది. ఇరవై నిమిషాల్లో డబ్బుతో వస్తాను అంటుంది. ఇరవై నిమిషాల్లో లోల డబ్బుని ఎలా సంపాదిస్తుంది. అసలు ఆ విపత్కర పరిస్థితి నుంచి మనిని రక్షించుకుంటుందా లేదా అన్నది సినిమా.

తన ఇరవై నిమిషాల కాలాన్ని . తన అనుకూలతల్ని దర్శకుడు మూడు సంఘటనలుగా విడగొట్టి చెప్పడం అధ్బుతం. ప్రేక్షకున్ని తనతో పాటు పరుగెత్తించాడు దర్శకుడు. అధ్బుతమైన స్క్రీన్ ప్లే, చివరకి వచ్చే హిందుస్తానీ సంగీతం వరకు మనమూ మన ఆలోచనల్ని లోల కాళ్ళతో పాటు పరుగులు పెట్టిస్తాడు దర్శకుడు.

లోల ప్రియుని కోసం పరుగేడుతుందా ? లేదా లోల స్థానంలో వుండి మనమే యే లక్ష్యం కోసం పరుగెడుతున్నాం అని ప్రశ్నించుకునేట్టు చేస్తాడు దర్శకుడు.

"అదే క్షణంలో అలాగే  జీవించు "అనేది జర్మన్ల ఫిలాసఫి. అప్పటికప్పుడు ఆ క్షణంలో ఎలాంటి ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటూ నిర్ణీత సమయంలో ప్రియున్ని కాపడుకోవడాన్ని ప్రయోగాత్మకంగా ఇరవై ఇరవై నిమిషాలుగా మూడు భాగాలుగా ఆమె పరుగును చిత్రీకరించాడు దర్శకుడు.

మనిషి తీసుకునే నిర్ణయాలు వాళ్ళ జీవితాలమీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి. సమయం గమ్యం నిర్దేషించబడి ఉన్నప్పుడు మనిషి తీసుకునే నిర్ణయాలు తన గమ్యానికి చేరువ చేస్తాయా ? దూరం చేస్తాయా ? అన్న పరిణతి మారుతున్న ఆమె ప్రతి పరుగులో కనిపిస్తుంది.

ఇదేదో సందేశాన్ని ఇచ్చే సినిమా కాదు. నీతి సూక్తులు వల్లిస్తూ భూమిలోకి దిగిపోయే అంత భారీ డైలాగులు వుండవు. its purely a German Classical Existentialism గురించి చెప్పే సినిమా. ఒకే సినిమాలో ఇరవై నిమిషాల్లో realism , Anti realism ,flashbacks ,  philosophical musings. emotional attachments and detachments. anger and acceptance  అన్నీ చూపించే ప్రయత్నం చేస్తాడు దర్శకుడు టాం టైక్వార్ ( Tom Tykwar). 

సినిమా చూస్తూ మన జీవితానికి కూడా ఇలా రివైండ్ చేసుకుని మళ్ళీ కరెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఎంత బాగుంటుంది అనే ఆలోచన వస్తుంది. సినిమాలో ఆమె  పరుగుని అదే పరుగుని మూడు సార్లు ఒక్కోసారి పరుగెత్తేప్పుడు ఆమె ఎలా ఎలా తన పరుగు లక్ష్యాలను మార్చుకోవాలో చూపిస్తూ తీస్తాడు దర్శకుడు . ఒక పరుగులో ఆమె చనిపోతుంది అనే ఆలోచన. రెండో పరుగులో మని చనిపోతాడు . ఇద్దరి మరణాలు లేకుండా ఆ గడ్డు సమస్యనించి బయటపడటం గురించి మూడో పరుగు. ఒక abstract సినిమా. ఎవరిని వాళ్ళు తమ నిత్య జీవితాన్ని ఆ సినిమాలో  చూసుకునేలా ఉండే సినిమా " రన్ లోల రన్ " ఈ సినిమా 1998 లో "టాం టైక్వార్ " దర్శకత్వం వహించింది.

Monday, February 19, 2018

కొంచెం నేను కొంత కవిత్వం

ఊహలకు ఆకారం ఉంటుందా? ఉంటె ఎలా ఉంటుంది. ఊహలని ఒక ఆకారం లోకి
ప్రవేశపెట్టడానికి మనిషి ఎలాంటి భావసంఘర్షణకి గురవుతాడు. ఊహలకి  భావాలకి మనిషికి మనసుకు మధ్య అంతర్లీనంగా కనబడకుండా ఆవరించుకుని ఉండే ఆ వలయం వేటిని తనలోకి లాక్కుంటుంది. ఎప్పుడూ ఈ ప్రశ్నలకి సమాధానం కాలంతోనే  మారుతూనే ఉంటుంది.

కొన్ని అనుభూతులు ఎప్పుడు మనసులోకి ప్రవేశించి ఆక్రమిస్తాయో తెలీదు.
ప్రవేశించడంతో ఆగకుండా అవి ఎప్పుడు ఒక రూపాన్ని సంక్రమించుకోవడం కోసం
అయస్కాంతంలా మారుతాయో తెలియదు. ఊహలకి నిర్దిష్టమైన ఆకారం ఉంటుందో లేదో కాని
అక్షరాలలోకి ఊహలు భావాలు ఒదిగేప్పుడు నిర్దిష్టమైన  ఆకారాన్ని మాత్రం
సంతరించుకుంటాయి.  భాష, వ్యాకరణం, వాక్య నిర్మాణం, తదితర నియమాలకు లోబడతాయి.
నియమాలకు లోబడే ఊహలు భావాలు ఏ సాహిత్య  ప్రక్రియలోకైన ఒదిగిపోవచ్చు.
అయితే అవి కవిత్వంలోకి రూపాంతరం చెందేప్పుడు అప్పుడే  పుట్టిన పసివాడంత
స్వచ్చంగా ఉండి మన చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆ పసితనపు స్వచ్చతలోకి
మనల్నీ లాక్కుంటాయి.

నా మట్టుకు నాకు కవిత్వం సంకల్పిత చర్యే.
ఒక సంఘటన, ఒక సందర్భం మనిషి మెదడులోకి అక్కడినుంచి
మనసులోకి చేరి మెల్లిగా మొలకెత్తి దాన్ని బయటికి విసిరి కొట్టే వరకు ఊరుకొని తుఫాను.
ఒకలాంటి అల్పపీడనం.

ఒక నిజాన్నికానీ, కోపాన్నికానీ, ఆనందాన్ని కానీ, ఉన్నదాన్ని ఉన్నట్టు అంటేనో
రాస్తేనో కవిత్వం కాదు. అయితే ఆ భావాలు పాఠకున్ని  
గుండెలోకి చొచ్చి ఆ గుండెని మెలిపెట్టే భావాల అల్లికే కవిత్వం.
కవిత్వాన్ని ప్రేమించే ఒక్కొక్కరూ ఒక్కోలా దానికి  జన్మనిస్తారు.

కవిత్వాన్ని నేను రాయడం మొదలుపెట్టినప్పుడు నాకు  
దాన్ని కవిత్వం అంటారని తెలియదు.  కవిత్వానికి ఉండాల్సిన లక్షణాలు ఇవీ అని తెలియదు.
కాని వ్యాసంలా రాసేస్ది మాత్రం కవిత్వం కాదు అనే ఒక స్పృహ నాకు ఉండేది.
నా చిన్నతనంలో  రెండో తరగతిలో ఉన్నప్పుడు  మిట్టమధ్యాహ్నం
మా బంగాళా పై బొంతేసుకుని పడుకుని ఆకాశంకేసి చూస్తున్నప్పుడు
మబ్బులు కదలడం చూసిన నాకు ఎదో కనుక్కు న్నానన్న సంబరంతో
మా అమ్మ దగ్గరకు పరుగెత్తి కెళ్ళి మబ్బులు కదులుతున్నాయి అని ఆశ్చర్యంగా చెప్పడం.
నాకు ఇంకా తాజా జ్ఞాపకం. రకరకాల ఆకారాల్లోకి  మబ్బులు మారేప్పుడు
నాకు వాటిని అలా కళ్ళలో ఖైదు చేయడం చాల నచ్చేది. ప్రతి ఆకారం
నాతో  స్పష్టంగా మాట్లాడుతున్నట్టు అనిపించేది.
రాత్రుళ్ళు పడుకుని ఆకాశంలోకి చూస్తున్నప్పుడు నక్షత్రాలని లెక్కపెట్టడం
లెక్క తప్పినప్పుడు మళ్ళీ లెక్కపెట్టడం చంద్రుని చుట్టూ వుండే
వలయాన్ని చూసి భయపడడం ఇవన్నీ ఏంటో తెలియని అనుభవాలు.

నా చిన్న తనంలో మేము చర్చికి ఎదురుగ ఉన్న ఇంట్లో ఉండేవాళ్ళం.
నేను మూడో తరగతికి వచ్చే వరకు ఆ ఇంట్లోనే ఉన్నాం.
చర్చ్ ని ఊడ్చి పట్టాలు వేసాక వాటిమీద ఆంధ్రక్రైస్తవ కీర్తనల పుస్తకాలు పెట్టేవాళ్ళు
ఎవరు ముందొస్తే వాళ్ళు ఆ పుస్తకాన్ని తీసుకుని పాటలు పాడడానికి వీలుగా.
నేను ఊడ్చేప్పుడే వెళ్లి చర్చ్ లోని ఆంధ్రక్రైస్తవ కీర్తనలని కంఠతా పట్టేదాక పాడాలని
మళ్ళీ మళ్ళీ పాడేదాన్ని. ఆ కీర్తనల్లోని పాదాలు పోలికలు నన్ను చాల ఆకర్షించేవి.
అలా కీర్తనలు రాయాలనే కోరిక కూడా బలంగా వుండడం
నన్ను తెలుగును ఇష్టపడేట్టు చేసిన కారణాల్లో ఒకటి.

కవితలు అని వేటిని అంటారో తెలియనప్పుడు నా చిన్న తనంలో
నేను ఆరో తరగతిలో వున్నననుకుంట అప్పుడు ఎన్. గోపి గారికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు
వచ్చింది. గోపి గారి గురించి ఒక డాక్యుమెంటరి దూరదర్శన్ లో వచ్చింది.
అప్పుడు గోపి గారు నానీలు చదివి వినిపుస్తున్నారు. ఆ నానీలు వింటున్నప్పుడు
ఓహ్ కవితలు ఇలాగే రాస్తారా అని ఒక బీజం నా మెదడులో పడింది.
ఇలాంటివి నేను కూడా రాయగలను అని అనుకుని
చిన్న చిన్న కోట్స్ రాసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
కవిత్వాన్ని ఇష్టపడడానికి ఈ సందర్భం కూడా ప్రేరణనే.

నేను మొట్టమొదటి సారిగా రాసిన కవిత ఇంటర్ రెండవ సంవత్సరంలో
ఉన్నప్పుడు  “ప్రవహిస్తూ వస్తున్న విద్యను నీ వైపు దోసిళ్ళతో పుచ్చుకుని
దాహం తీర్చుకో “ అంటూ సాగుతుంది. విద్య ప్రవహించడం అంటూ
ఎలా మొదలు పెట్టానో ఇప్పటికి అర్ధం కాదు. ఇలా డిగ్రీ వరకు కవితలు అంటారో అనారో
తెలియని వాటిని ఒక నలభై వరకు రాసుకున్నా.
ఇలా కవితలు రాయడం మొదలు పెట్టినా ఫేస్ బుక్ లో రాయడం ఒక కొత్త అడుగు అనుభవం.
కవులతో పరిచయాలు . పత్రికలకు కవితల్ని పంపడం వాటిని అచ్చులో చూసుకోవడం
ఆనందపడ్డం మరో అనుభవం.

ఈ క్రమంలోనే అనేకమైన కవితల్ని ఫేస్ బుక్ లో
చదవడానికి నాకు ఆస్కారం దొరికింది.
అప్పటి వరకు నాకు అప్పుడొకటి అప్పుడొకటి దొరుకుతున్న కవితలు.
పూర్తి స్థాయిలో ఫేస్బుక్ లోనే దొరకడం.

అయితే  
నాకవిత్వమధర్మాయ వ్యాధయే దండనాయ వా|
కుకవిత్వం పునః సాక్షాన్మృతి రాహుర్మనీషిణః|| –
భామహుడు, కావ్యాలంకారం. 7వ శతాబ్దం.
(నువ్వు కవిత్వం రాయకపోతే అది తప్పు కాదు. నీకు జబ్బు చేయదు. నిన్నెవరూ తిట్టరు, కొట్టరు. కానీ చెడు కవిత్వం రాస్తే నువ్వు తప్పకుండా నీ పాఠకులను చంపినవాడి వవుతావు.)  లాంటి శ్లోకాలు కాని కుకవిత్వం అని వినడం కాని నాకు అంతకు ముందు వరకు ఎప్పుడూ తెలియదు. ఇవన్నీ ఫేస్ బుక్ లోనే వినడం.
కవిత్వంలో  కుకవిత్వం కూడా ఉంటుంది  అని తెలిసినప్పుడు నాకు చాల ఆశ్చర్యం కలిగింది.
అరె నేను రాస్తున్నది కవిత్వమా? కుకవిత్వమా? అన్న సందేహం కూడా నన్ను వెంటాడింది.
ఒక వేళ నేను రాస్తున్నది కవిత్వమే అయితే నా కవిత్వానికి వీళ్ళు కవిత్వం అని చెప్పుకోదగ్గ లక్షణాలు ఉన్నాయా ? అని రీసెర్చ్ చేసుకోవడం మొదలు పెట్టాను. అందుకు నాకు గూగుల్ చాల ఉపయోగపడింది. కవిత్వం అని కొడితే ఎన్నో వ్యాసాలు వాటికి సంభందించిన లింకులు నా ముందు ప్రత్యక్షమైయ్యేవి. వాటిని చదువుకోవడం నేను రాస్తున్న కవిత్వాన్ని పరీక్షించుకోవడం ఇదే పనిగా పెట్టుకున్నాను కొన్ని రోజులు. జాన్ హైడ్ కనుమూరిగారు , అలాగే అఫ్సర్ గారు కవిత్వం వాచ్యం అవడం గురించి నాతో పదే పదే చర్చించే వాళ్ళు. నా కవిత్వంలో అనవసర పదాలు వాడినట్టు కనిపిస్తే జాన్ హైడ్ కనుమూరి గారు వెంటనే ఫేస్ బుక్ లో మెస్సేజ్ పెట్టేవాళ్ళు. ఆ పదాల అవసరం అక్కడ ఉందా అని. ఇలా పేరు ప్రఖ్యాతలు ఉన్న కవులు కూడా ఫేస్ బుక్ లో వుండడం irrespective of their designation and position ఏ జంకు లేకుండా పలకరించి మాట్లాడడానికి ఫేస్ బుక్ వేదిక కలిగించింది.

ఇలా రాస్తూ ఉండగా నాతో పాటు కొత్తగా రాస్తున్న నా తరం పిల్లలం ఒకరితో ఒకరికి పరిచయాలు బలపడుతూ రావడం మొదలైంది. సమకాలీన కవిత్వం గురించి మాట్లాడాలంటే కవుల గురించి కూడా మాట్లాడాలి. కొత్త తరం కవులే కాదు. మా ముందుతరం సీనియర్ కవులు కూడా చాల మంది ఫేస్ బుక్ లో మా కళ్ళ ముందు ఉండడం మా అదృష్టం. వాళ్ళు కూడా ఫేస్ బుక్ వేదికగా కవిత్వం రాయడం. కవిత్వంపై చర్చలు వ్యాసాలూ కొనసాగించడం వాటిని చదువుతున్న నా లాంటి కొత్త పిల్లలకి కవిత్వం పట్ల అవగాహన్ ఏర్పడడం కవిత్వం రాయడం పట్ల మక్కువ ఏర్పడడం సర్వసాధారణంగా జరిగిన విషయం. అయితే ఫేస్ బుక్ లో నేను పేజీ మొదలు పెట్టి రాస్తున్న క్రమంలో ఫెంటోస్ అనే గ్రూప్ ఉండేది. అది మినీ కవిత్వ ప్రక్రియకి సంబంధించిన గ్రూప్. అయితే ఒక నిబంధన పెట్టుకుని ఆ నిబంధనకి లోబడి చిన్న చిన్న పాదాలు రాసేవాళ్ళం.

మొదటి వరుసలో పదిలైన్లు రెండో వరుసలో పదిహేను లైన్లు దాటకుండా భావాన్ని వ్యక్తపరచాలి. ఆ గ్రూప్ లో రాస్తూ పరిచయంఅయిన నేను , నర్ష్కుమార్ సూఫీ, అనిల్ డాని , చైతన్య శంకర్, వర్నలేఖ, వంశీధర్ రెడ్డి, ఇలా మా పిల్లల బ్యాచ్ అంత కవి సంగమం అనే ఒక గ్రూప్ ఏర్పడిందని తెలిసి అందులో చేరి అక్కడ కవిత్వం రాయడం మొదలు పెట్టాం. మేము కవి సంగమంలో  చేరక ముందు విజయభాను అక్క, కేక్యూబ్ వర్మ గారు అడ్మిన్ లు గా స్వేచ్చ అనే గ్రూప్ వుండేది అందులో కవిత్వం దానికి సంభందించిన చర్చ జరుగుతుండేది. దాని తరువాత కవిత్వం కోసమే ఏర్పడ్డ గ్రూప్ గా కవి సంగమం ముందుకు రావడం. ఫేస్ బుక్ లో కవిత్వం రాస్తూ ఔత్సాహికులుగా ఉన్న వాళ్ళను ఒక చోటకు తెచ్చి రాసుకునే వేసలుబాటుగా వేదికగా మారడం అందులోఏ బేషజాలు లేకుండా సీనియర్ కవులు కూడా కవితలు రాస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ వ్యాసాలు వ్యాఖ్యలు రాయడం. నాకు /మాకు ఒక పాఠం. కవి సంగమం తో పాటు సింగిడి గ్రూప్ ఏర్పడడం, ఆ తర్వాత అనేక రకాలైన కవిత్వ గ్రూపులు ఏర్పడి విరివిగా కవితల్ని రాసే సమూహాల్ని నిర్మించడం ఆశ్చర్యానికి గురి చేసిన అంశం. 

ఈ గ్రూప్ లలో అనేక రకాలైన  కవిత్వం వచ్చేది. ప్రేమ విత్వం  , విరహ కవిత్వం ,   ఒంటరితనానినికి సంభందించిన  కవిత్వం, భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, కాల్పనిక కవిత్వం. విప్లవ కవిత్వం , అస్తిత్వ వాద కవిత్వం. మైనారటీ కవిత్వం , తెలంగాణ ఉద్యమం నేపద్యంగా తెలంగాణా రాష్ట్ర అవతరణ కోరుతూ తెలంగాణ యాస ప్రతిఫలిస్తూ   తెలంగాణ కవిత్వం. తెలంగాణాని వ్యతిరేకిస్తూ కవిత్వం. సామాజిక జాడ్యాల మీద మూడ నమ్మకాల మీద , సామాజిక అసమానతల మీద , స్త్రీల మీద జరిగే అత్యాచారాల మీద ఇలా విపరీతంగా కవిత్వం ఫేస్ బుక్ ని ముంచెత్తింది.
కొందరు సీనియర్ కవులు ఇది మంచి పరిణామం అన్నారు. కొందరు ఇది ఎక్కడికి దారి తీస్తుందో అని భయపడ్డారు. మరి కొందరు లైక్లు కామెంట్ల ధోరణి కవితా స్పూర్తిని చెడగోడుతుందని భయం వ్యక్తం చేసి దూరంగా ఉన్నారు. ఆపై కొందరు కవితల్ని విమర్శించే విమర్శకులు ఉంటె బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేసారు.
నేను ముందు పేర్కొన్నట్టు కవిత్వం , కుకవిత్వం అన్న మాటలు మళ్ళీ మళ్ళీ వినిపించడం మొదలైంది.మరి వేల సంఖ్యలో కవిత్వం గ్రూప్ లలో చేరుతున్న వాళ్ళందరూ కవులేనా ? ఇదో పెద్ద ప్రశ్నగా తయారైయింది చాల మందికి. గ్రూప్ లో ఉన్నాం కదా అని రాసే వారి సంఖ్య కూడా పెరగడం మొదలైంది. మరి కవిత్వాన్ని ఎలా వడబోసి కుకవిత్వం కాని దాన్ని వెదికి పట్టుకోవడం ?? అదీ గాక ఇంటర్నెట్ కవులు అన్న ఒక ట్యాగ్ మొదలయ్యాక అది ఒక లాంటి తిట్టు లాగా భావించేసున్నితత్వం. మా కవిత్వాన్ని పత్రికలకు పంపి అక్కడ పబ్లిష్ అయ్యాక ఆనంద పడ్డం కూడా మొదలు పెట్టాం. ఈ క్రమంలో మాకు ఒక విషయం అర్ధం అయింది. పత్రికలలో పబ్లిష్ అవడం అంత తేలిక కాదు అని. అయితేనేం ఫేస్ బుక్ లో తమ భావాల్ని స్వేచ్చగా వ్యక్తం చేస్తున్న వాళ్ళు ఎక్కువే వున్నారు.

అయితే నేను రాయడం మొదలు పెట్టినప్పటినుంచి ఎలాంటి కవిత్వాన్ని చూస్తున్నాను   ఏది రాస్తూ వస్తున్నాను అదంతా కాలంతో పాటు నా అనుభవంతో పాటు మారుతూ వస్తుంది. కాలం పరిణతిని తీసుకోస్తూనే ఉంది. మాట్లాడేవాళ్ళు కొత్త తూనికరాళ్ళు కనుక్కుంటూనే ఉన్నారు. కవిత్వం రాసే వాళ్ళు రాస్తూనే ఉన్నారు. వాళ్ళ అడుగుల పక్కగానో కాలిపో నేను అడుగులేస్తున్నాను అవి ముందుకో వెనక్కో కాలం కొలమానంలో నిర్ధారించబడతాయి. కాని తొందర పడి కూసే కోయిలలకు సమాధానం చెప్పే పని పెట్టుకోకూడదని మాత్రం నేను అనుకున్నాను. అనుకుంటున్నాను. నన్ను నేను కవిత్వంతో నింపుకోవడం ప్రస్తుతం నా పని. అది కవిత్వమనే కాదు నన్ను పరిపూర్ణం చేసే ఏ సాహిత్యమైన నాలో ఇంకిపోవాలని స్వీకరిస్తూనే ఉన్నాను. నేనింకా కట్టబడుతున్నాను . నిర్మాణం మొత్తం అయ్యాకే దాని స్వరూపం స్వభావం కట్టడం యొక్క అందం తెలిసేది. అది జీవిత చరమాంకానికి కాని అర్ధం అవదేమో.
ప్రస్తుతానికి ఇంతే సెలవు.