Friday, October 25, 2013

"రాతి కెరటాలు" - గోపి గారి కవిత్వపు ఒడ్డున..
______________________________

__"పగ్గాలు వేసి 
పర్వతాన్ని పడగొట్టకండి
 పద్యంలో ఉన్నాను 
లోకం తలుపులు తీయకండి " |రాతి కెరటాలు - గోపి గారి కవిత్వం | 
సాయంసంధ్యావేళ చెరువు అంచున కాళ్ళు ఊపుతూ కూర్చుని, చల్లని గాలి ఒంటిని స్పృశిస్తూ ఉన్నప్పుడు అస్తమిస్తున్న సూర్యుడి గురించి ఆలోచిస్తూ, మిగిలిన వెలుగును హృదయంలో నింపుకోవాలనే ఆరాటపడుతున్నట్టు కళ్ళు పడే తపనలా అనిపించింది ఈ కవిత్వం " రాతి కెరటాలు ".

నీటి కెరటాలు మనిషిని, మనసును సహజంగానే మెత్తగా తాకుతాయి. కొన్ని జ్ఞాపకాలను మృదువుగా కదిలిస్తాయి. ఇంకొన్ని జ్ఞాపకాలను కడిగేస్తాయి. కాని "రాతి కెరటాలు "అనే టైటిల్ గోపి గారు ఎందుకు ఎంచుకున్నారో ఆయన్నే అడగాలి. కెరటం జ్ఞాపకమైతే, కెరటం అనుభవమైతే, ఆ కెరటం స్వభావం రాయిలా కదలనిది, కదిలినా గాయం చేసేదైతే..?? ఆలోచించాల్సిందే. హృదయంలోంచి ఇలాంటి రాతి కెరటాలు అప్పుడప్పుడు బయటికి వస్తే ఇలాంటి కవిత్వం అవుతుందేమో ..!?నలభై నాలుగు కవితల సంకలనం ఈ "రాతి కెరటాలు "./రాతి గుండెను మించిన నవనీతం మరొకటి లేదు /
/రాయి కదలదు కదిలేది చరిత్రే /
/చరిత్ర ఓ సముద్రం రాయి
ఒక అనాది పడవ 
కదలని రాతివైపు కడలి వచ్చేది తీరమే / 
 ఇవ్వాళా రాయి అతని చేతిలో ఆయుధమయ్యింది - అంటూ
గోపిగారు "రాతి కెరటాలు" అనే శీర్షికతో మొదటి కవిత ప్రారంభించారు .

ఈ కవిత్వపుస్తకంలో . తన మనసును చరిత్రవైపుకు, జ్ఞాపకాల వెంట అడుగులు వేయిస్తూ ఆ జ్ఞాపకాలతో తనకున్న అనుభవాల పరిమళాల్ని కవితల్లో మనకు అందిస్తూ.'కాంతి' కవితలో గుండెకు మట్టికీ పోలికలున్నాయని రెండు స్పందనలే అంటూ -
/రొట్టెను ముట్టుకుంటే తెలిసింది 
ఆకలిదెంత చైతన్యమో !/ అంటూ
 /చెమట చుక్కల్ని చూస్తే అనిపించింది 
జీవకళలు వెదజల్లే శ్రమ సౌరభం ముందు 
చుక్కలు ఎంత కాంతిహీనమో !../ అని 
మనిషిలోని నిజమైన కాంతి మనిషి ఆశించే ఎదురుచూసే కాంతిని గూర్చి తెలియజేస్తారు.

 నన్ను ఆసాంతం ఆకట్టుకున్న కవిత 'మగ్న'______
"పద్యంలో ప్రవేశించాను 
వెనుకకు రావడం కష్టం
ఆకులను నిమిరే గాలి లాగ 
ఆకాశాన్ని అలుముకున్న ఆవేశంలాగ
సముద్రంలో వేలు అద్దుతూ 
సృష్టి గ్రంధంలోని 
ఒక్కో పుటను తెరుస్తున్నాను 
అధ్యయనంలో ఉన్నాను
అలజడి చేయకండి "____ అంటూ సాగుతుందీ కవిత.

ఎంత అందంగా కవి హృదయం, కవితా లోకంలో ఎలా విహరిస్తుందో చెప్తూ అదే తన ప్రపంచంగా ఎలా మారిందో అధ్బుతంగా రాసారు గోపి గారు. 'రాజ గోపురం ఆ రెండు పక్షులు' అన్న కవిత చదివినప్పుడు, మొన్న సిటి లైఫ్ హోటల్ కూలిన సంఘటన యధావిధిగా చూస్తూ రాసారా అన్నట్టు వుంటుంది. అయితే అది 2010లో గాలి గోపురం కూలినప్పుడు రాసిన కవిత. అప్పుడు ఇప్పుడు తరువాత కూడా కవిత ప్రాణంతో ఉందనడానికి ఉదాహరణా అని అనిపించింది.

అలాగే 'ఇల్లు 'అంటూ రాసిన కవిత మనకు మన ఇంటి మీద ప్రేమను పెంచుతుంది. 'బుజ్జిగాడు ' కవిత మరో ఆశ్చర్యం నాకు. ఇంత సున్నితమైన విషయాలను ఆయన ఎంత అధ్బుతంగా రాసారా ?అనిపిస్తుంది. వాళ్ళింట్లో బుజ్జిగాడు ప్రతి ఇంట్లో పారాడిన బుజ్జోల్లను గుర్తుచేస్తుంది. ఆ కవితలోని ఈ పాదాలు చూడండి ________
" పసి నిఘంటువు ముందు 
ముదురు మాటలు 
ముఖం ముడుచుకుంటాయి " __ఈ మాటలు ఆ కవితాసారాన్ని తెలియజేస్తాయి.

''అంక గణితం "అనే కవితలో తనకు కొండతో ఉన్న జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ....
/దీనిపై వ్యాపారపు నీడను పదనివ్వకండి /అని విజ్ఞప్తి చేస్తూ ప్రకృతితో ఆయనకున్న అనుభంధం మనకు కూడా కలిగేలా చేస్తారు గోపి గారు ."నీళ్ళ సీసా " అనే కవిత చదువుతున్నప్పుడు నవ్వు నా పెదాలపై తెలియకుండానే చేరింది. నీళ్ళ సీసాను పట్టించుకొని దానిపై కవిత్వం రాయడం. అది కూడా తన ముద్రను కలిగి ఉండడం నన్ను ఇంకా ఎదో నేర్చుకోవాలని సూచిస్తున్నట్టు అనిపించింది. అందులోని నాలుగు లైన్లు చూడండి ____"బుజ్జి పిల్లిలాగా 
కుందేలు పిల్లలాగా
చంకలో ఒదిగిన సీస 
కలతలు చుట్టు ముట్టినప్పుడు 
వేళ్ళమధ్య నలిగిన సీస 
ఇప్పుడు ఎడారంత ఖాళీతో 
బోసిగా కనిపిస్తుంది అయితేనేమి ??
 నా కవిత్వంతో నింపుతాను 
కన్నీళ్లు కాదుకాని
దాని గోడల నిండా అలాంటి తడి
ఎదో మిగిలే ఉంది."_____అంటారు.. 

'ఆల్కెమీ ' కవితలో కవి అంటారు__'భావాలు ఒక గదిలోంచి మరో గదిలోకి వీచే ప్రాణ వాయువులు' అని . జాలరుల జీవనాన్ని చిత్రేకరిస్తూ 'ఆకాశం సాక్షిగా ' అని సముద్రపుత్రుల సాహసాన్ని కళ్ళకు కడతారు. నిన్న నేడులను జ్ఞాపకం చేసుకుంటూ రాసిన 'వ్యత్యాసం ' కవిత మరో మార్కు. అందులో పాదాలు చూడండి ___"నుదిటి మీది 
చెమట బిందువులను విదిలిస్తే 
నలువైపులా 
ముత్యాల విత్తనాలు రాలేవి" అంటూనే ..
నేటి విలాసవంతమైన జీవితంలో కొట్టుకుపోయే మనిషిని మళ్ళీ దొరికిన్చుకోవాలనే చేసే ప్రయత్నం మనల్ని కూడా అక్కడే ఆగిపోయేలా చేస్తుంది .
/నాకే కాదు నిద్రకు నిద్ర రాదు /.ఎప్పుడు నా దోసిట్లో గుప్పెడు /అక్షరాలూ పెట్టే నిద్రకు/నా కృతజ్ఞతలు /అంటూ గోపి గయు 'నిద్ర ' కవిత మనల్ని కూడా (కవులైన వారిని) నిద్రకు కృతజ్ఞతలు చెప్పేలా చేస్తుంది.మరో మంచి  కవిత 'పిడికిలి '__ /ఇప్పుడిది /శరీరానికి మొలిచిన/జెండాలా ఉంది /పిడికిలి ఇవాల్టి రెప రేపల అలజడి / అంటూ విప్లవాల చుట్టూ తిరిగే వారినే కాదు. సామాన్య మానవుణ్ణి కూడా ఆలోచించేలా చేసే కవిత ./ అందరికోసం స్వప్నించే పిడికిలి లేదంటే అది నిరర్ధకమైన ఎముకల అలికిడి / అంటూ పిడికిలి ఉద్దేశ్యాలు గుర్తు చేస్తారు. 

ప్రతి కవికి జ్ఞాపకాలు ఒంటిని అంటుకుని ఉండే పైవస్త్రం లాంటివి. " స్కూలు గంట " గురించి ఆయన రాసిన కవిత మళ్ళీ మనల్ని బడి మెట్లు ఎక్కేలా చేస్తుంది. గొడుగు, టెలిఫోను , మురళి అమ్ముకునే వాడిపై రాసిన "అమ్మకం", నీడ , స్నేహం . పెన్ను గురించి రాసిన కవిత 'ప్రక్రియ '. రోజులు మారిపోతున్నాయి అంటూ రాసిఇన కవిత "అవునా ".._____

ఇలా రాతి కెరటాలలోని ప్రతి కవిత కోట్ చేయగలిందే. ఒక్కో కవిత ఒక్కో అనుభూతిని మిగిలిస్తూ మన జీవితంలోని అనుభవాలకి దగ్గరగా జరిగి మనతో స్నేహం చేసేలా ఉన్నాయి. అందుకే ఇ/ప్పుడు ఈ కవిత్వ పుస్తకం నాకు దొరికిని కొత్త కవిత్వ నేస్తం. కొత్తగా కవిత్వం రాస్తున్న వారు చదవాల్సిన పుస్తకం
 ----------- (5/8/2013) ----------------------------------

Friday, October 18, 2013

"దేవరశిల"_మాట్లాడుతుంది

18 October 2013 at 19:06
తెల్లటి ఆకాశం మీద 
నల్లటి మోడాలు కమ్ముకుంటా వుండాయి 
నల్లమబ్బులు ఆకాశాన్ని ఈదుకుంటా 
ఎర్రకొంగల గు౦పొకటి
బయలు దేరింది ఈ దారిలోనే ________ ఈ మాటలు Vempalli Gangadhar   గారు రాసిన  "దేవరశిల" కథాసంపుటి లోవి.  

అప్పటి వరకు ఆదివారం మ్యాగజైన్లలో లేదా మాసపత్రికల్లో కథలు చదవడం వరకు తెలుసు. ఎందుకో మ్యాగజైన్ ల్లో అన్నీ చదివాక ఆ తరువాత తీరికగా  కవిత , కవిత తరువాత కథ చదివేదాన్ని. కాని ఈ కథా సంపుటి చదివాక నిజంగా కథల మీద అత్యంత ఇష్టం పుట్టుకొచ్చింది. వేంపల్లి గంగాధర్ గారు రాసిన రెండు కథల పుస్తకాలున్నాయి నా దగ్గర.  ఆయనకీ సాహిత్య యువపురస్కారం తెచ్చిపెట్టిన కథా సంపుటి "మొలకపున్నమి " అలాంటిదే "దేవరశిల "కూడా.. కాలేజ్ లో నా డెస్క్ లో ఈ రెండు పుస్తకాలు వీటితో పాటు చలం, శివారెడ్డి , తిలక్ కవితా సంపుటాలు౦డేవి. 


ఓ రకంగా కవిత్వాన్ని ఎక్కువ ఇష్టపడే నేను కథ మొదటి రెండు పేరాలు చదివి నచ్చక పోతే లేదా predict చేసేట్టు ఉంటే  అక్కడికి వదిలేయడం చేసేదాన్ని. కాని ఈ రెండు కథా పుస్తకాలు మనల్ని ఎంత సేపు వీలయితే అంత సేపు మాట్లాడకుండా పాత్రలద్వారా మనల్ని ఆలోచనలోపడేసి ఇక బయటికి రాకుండా ఉంచుతాయి. 


రామతీర్ధ  గారు  " దేవరశిల " పుస్తకానికి ముందు మాట రాస్తూ ___"బెన్ ఒక్రి" మాటలను కోట్ చేసారు. ఏంటంటే _" మన మూలాల్లో ప్రతిధ్వనించేవి , మన ముగింపులో మార్మికమై, అంతుపట్టని మన ఆరంభాల్లో, దైవీయమైన మన విధి బలీయతల పట్ల లోలోపలే గ్రహింపు కలిగిఉండి, ఈ రెండిటిని ఒకటిగానే ఏకం చేయగలిగేవే గొప్పకథలు " అని. ఈ కథాసంపుటి చదివాక ఎవరికైనా  అలాగే  అనిపించక మానదు. 


ఇప్పటికి సంవత్సరంన్నర.   ఈ పుస్తక౦  నా దగ్గరకొచ్చి.  ఇప్పటికి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు తీసిచదువుతూనే ఉంటాను. ఉన్నట్టుండి గాలి కథలవైపు మళ్ళిందేటాని సందేహం రావచ్చు. ఉదయం టీవిలో ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ శివాలయం కింద వెయ్యిటన్నుల బంగారం ఉంది అనే వార్తా .  ఓ 30 నిమిషాల డాక్యుమెంటరీ వేసారు టీవీ లో . ఓ సాదువుకి కలలో ఆ ప్రాంతాన్ని పాలించిన రాజోచ్చి అక్కడ బంగారు నిధిని దాచిపెట్టాడని  దాన్ని కాపాడుతూ ఆయన ఆత్మలాగే అక్కడే తిరుగుతున్నాడని  అది త్రవ్వించి తనకి విడుదల కలిగించమని.   సాదువుకి  మనవి చేస్తే ఆయన ప్రభుత్వానికి, పురావస్తు శాఖ వారికి లేఖ రాసాడట .  ఆ బంగార౦ కోసం త్రవ్వకాలు చేసే పని మొదలు పెట్టేట్టు చేసారు  బాబా గారు అని వార్తలు. మొత్తానికి మరో పద్మనాభస్వామి  ఆలయంలా అక్కడ కూడా బంగారం దొరక్కపోదాని ప్రభుత్వ ప్రజల ఆశ. ఆ సాధువు బాబా ఏది చెపితే అది జరుగుతుందని ,అది రుజువైందని అక్కడి వారి నమ్మకం. పై సంఘటన చూస్తూ ఉన్నప్పుడు నాకు "దేవరశిల " కథా సంపుటిలోని కథ "అంజన సిద్ధుడు " గుర్తొచ్చాడు.  


రాయలకాలంనాటి కావలిసత్రంలో అంజనం వేసేవాల్లందరూ ఉండేవాళ్ళట. హిరణరాజ్యంలో ఎక్కడ ఏ౦  జరిగినా జనమంతా అక్కడికెళ్ళి తమకు కావలసిన సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండేవారు. అందుకే ఆ ప్రాంతాన్ని అంజన పల్లె అనే వాళ్ళు. అయితే చివరిగా పక్కీరయ్య అనే ఓ పెద్దాయన మాత్రం మిగిలిపోయి ఎప్పుడు కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండేవాడు . తన  మనోనేత్రంతో జరిగేదంతా చూస్తూ వచ్చిన వారి బాధల్ని కష్టాల్ని, విని సరి అయిన ఉపాయం సమాచారం చెప్పేవాడు . అంతే  కాకుండా పట్టిన దయ్యాలను కూడా వదిలించే వాడు. ఆయన ముసలితనానికి దగ్గరగా రావడంతో ఇద్దరు శిష్యులను తయారు చేసుకుని వారికి విద్యలు నేర్పుతాడు.ఒకడు అంజన సిద్దులయ్య ఇంకొకడు తిరుమలయ్య . పకీరు తరువాత పెద్ద దిక్కుగా ఇప్పుడు  ఆ ఊరికి మిగిలింది అంజన సిద్దులయే . ఓ రోజు కొండారెడ్డి వాళ్ళ దగ్గరకోస్తాడు .పూర్వం ఓ సారి ఆయన ఆవుల మంద తప్పి పొతే అంజనం వేసి చూసి అవి ఎక్కడ దొరుకుతాయో చెప్పింధీ అంజన సిద్దులయ్యే . ఈ సారి వచ్చినప్పుడు కొండా రెడ్డి ఓ విచిత్రమిన విలువైన విషయం తీసుకుని అంజన పల్లె వెళ్తాడు.  తన భార్య మందను కాస్తున్నప్పుడు ఆమెకి ఓ బంగారు ముక్కు పుడక (ముక్కుకమ్మి ,ముక్కు నత్తు ) అక్క దేవతల కొండ మీద దొరికిందని , వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నా సమాచారం ప్రకారం అక్కడ ధన నిధి ఉండే అవకాశం ఉందని అంజనం వేసి తెలుసుకోమంటాడు . అంజన సిద్దయ్య ససేమీర కుదరదు అంటాడు . చివరికి   కరువు పేరుతో   కొండా రెడ్డి అలా ఇలా మొత్తానికి ఎలాగోలా బలవంత పెడతాడు. అంజన సిద్దయ్య ఒప్పుకోవడం వల్ల  ఏం జరిగి౦ది అనేదే కథ. ఈ కథ చదివాక ఏడవటం  ఖాయం .. 


ఈ కథ ఒక్కటే  కాదు ఈ పుస్తకంలో ఉన్న ప్రతి కథ  హృదయానికి హత్తుకుంటు౦ది .  ఎవరు ఆలోచించలేని కథా వస్తువులు వేంపల్లి గంగాధర్ గారు ఎంచుకోవడం ఆయన ప్రజ్ఞ్యకి నిదర్శనం. వేంపల్లి గంగాధర్ గారు  తెలుగులో మొట్ట మొదటిగా " సాహిత్య అకాడమీ అవార్డ్  యువపురస్కారం "అందుకోవడం నిజంగానే అభినందించాల్సిన విషయం. 


ఈ కథా పుస్తకంలో అన్నీ కథలు చెప్పుకోదగ్గవే -> తూరుపు కొమ్మలు , నెల దిగిన ఊడ, నెత్తుటి మాన్యం , వాన రాయుడి పాట, కొయ్య బొమ్మలు , అంజన సిద్ధుడు , ముడుపు కొయ్య, కొలిమ్మాను , వెనుకటి కాలం కాదు , నీడలు , ఊరిని మర్సిపోబాకురా అబ్బీ , పొద్దు పుట్టింది ... ఈ కథలే కాక ఆయన సాహిత్యం కథలు వ్యాసాలూ రచనలన్నీ ఉచితంగా డౌన్ లోడ్ చేసుకొని చదవచ్చు www.vempalligangadhar.in


కడప, రాయలసీమ మాండలికాల్లో రాసిన ఈ కథలు అంతే స్వచ్చంగా చదివిన ప్రతొక్కరిని హత్తుకుంటాయి. ఆ పాత్రలు సజీవంగా మనతో నడిచి వస్తాయి.. అలాంటి సందర్భాలు కనిపించినపుడు వెంటనే "దేవరశిల "గుర్తొస్తుంది .. ఇలాంటి అధ్బుతమైన కథల సంపుటిని తెచ్చిన రచయిత డా || వేంపల్లి గంగాధర్ గారికి అభినందనలు . 

చివరిగా k. వెంకటేశ్వర రాజు "దేవరశిల" పుస్తకం కోసం రాసిన మాటలు ______
ఎండపెడ్తా౦ది. వాన కురుస్తుంది,ఎండావాన.
మిట్టమధ్యాహ్నమప్పుడు ఈ సిత్రమేంది ?
గరుడ స్థంభం పక్కలో పెట్టుకొని గుడిమెట్ల మీద కూర్చున్నవాడు పాడే
పాటవినిపిస్తాందా ?
ఇప్పపూలు శబ్దం లేకుండా చెట్టునుంచి
రాలిపడ్త వుండాయా ?
పడమటి కొండ దిక్కు మోడాలు కమ్ముకొని చినుకులు కురుస్తాంటే
మట్టి వాసన వస్తాందా ?
రావిచెట్టు కొమ్మలు ఊగుతా ఊగుతా అప్పుడప్పుడు నేలపైకి వాలి
భూమి తల్లిని ప్రేమగా ముద్దాడతా వుండాయా ?
ఒక కంట్లో సూర్య భాగావానుడ్ని మరో చంద్రబింబాన్ని చెక్కిన
యుద్ధ వీరుడి వీరగల్లు నెత్తుటి మాన్యానికి కాపలా కాస్తా వుండాదా ?
ఓరి దేవుడా ?

Wednesday, October 16, 2013

ఓ వాన - ఓ కొబ్బరి చెట్టు - నేను

15 October 2013 at 01:05
ఇవాళ నేను నిజంగా పండుగ చేసుకున్నాను. అవును పండుగంటే ఏంటి? నా చుట్టూ ఉన్న వాళ్లనడిగా పండుగంటే పండుగే అన్నారు. నిజమేనేమో,.. పండుగంటే ఇది, ఇందుకోసమే పండుగ చేసుకుంటాం అని కచ్చితంగా ఎవరు నిర్వచించలేరేమో? అయితే మన పరిధిలో లేని దాన్ని చేరుకున్నప్పుడో, ఊహించలేని మంచి జరిగినప్పుడో, అసాధ్యమైన యుద్దాలో అవిశ్వాసాలను గెలిచినప్పుడో, మనసు నిండా హృదయం పొంగేంత ఆనందం నింపే క్షణాలు సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు నిజంగానే పండగ చేసుకుంటాం. ఆ క్షణాల్ని సజీవంగా బ్రతికించుకోడానికి పండగ చేసుకుంటాం.


ఈవేళ నేను పండగ చేసుకున్నా. హెచ్ ఆర్కే గారి "వానలో కొబ్బరిచెట్టు "కవితా సంకలనం చదువుతూ. ఒక జీవితం కవిత్వమై నాకు పంచ భక్ష్య పరమాన్నాలు వడ్డిస్తుంటే. ఒక వసంతాన్ని భుజాన వేసుకొచ్చి కోకిలై కవిత్వాన్ని వినిపిస్తుంటే. ఉగాది పచ్చడై జీవితాన్ని షడ్రుచులుగా రుచిచూపిస్తుంటే.

"వానలో కొబ్బరిచెట్టు " కవిత్వం నన్ను ఆసాంతం తడిపేసింది. నన్ను కొబ్బరి చెట్టుని చేసి, కవిత్వమై నన్ను తడిపింది. ఇందులోని మొదటి కవిత "వానలో కొబ్బరి చెట్టు " ఈ కవితలో కవి అంటాడు "నువ్వొక కొబ్బరి చెట్టు "(పు 12). కొబ్బరి చెట్టుకు వానకు సంబంధం ఇంత అధ్బుంగా చిత్రీకరించి నన్ను ఆ కవిత్వ వాన ప్రవాహంలో కొట్టుకుపోయేలా చేసింది ఈ కవిత్వం.
 -
వానలో కొబ్బరి చెట్టు ఓలలాడుతుంది 
 కొబ్బరి చెట్టులో వాన నాట్యమాడుతుంది 
 అడవి -చెట్టును కప్పేసే లతలా బతుకు చుట్టూ మండుతుంది ( పు 12)
 అవునేమో వానలో కొబ్బరి చెట్టు, కొబ్బరి చెట్టులో వాన ఒదిగిపోయి పెనవేసుకునే  సందర్భంలోంచి కొద్దిగా బయటికొచ్చి, నీటి గురించి కవి రాసిన మాటలు ఒక దృశ్యాన్ని ఆవిష్కరించాయి.

మనిషి కొబ్బరి చెట్టైతే, వాన కవిత్వమని వాన కురిపించే నీరు కవిత్వమని  చెబుతూ (పు 13) లో ఇలా అంటాడు
-
నీరు బతుకును మోస్తుంది 
 విశ్లేషణకు వీలుగా చాకై కొస్తుంది 
 చల్లని మడతలలో దిగులును ముడిచి
 తెల్లని ఊపిరి ఉలిపిరి పొరల్లో దాస్తుంది
 శబ్దిస్తుంది, నిశ్శబ్దాన్ని నిర్వచిస్తుంది
అడవి దారిలో అలిసిపోయి ఒక దాపున కూర్చున్నప్పుడు
 విన్పించే
 కొండవీణ ఏక స్వరం సెల స్వనం లోని నిశబ్ధం నీటిది //
 ఈ నీరు ఏమై ఉంటుంది. నీరు బతుకును మోయడం ఏంటి? కొద్ది సేపు ఆలోచించిన నాకు అనిపించింది ఈ నీరు కన్నీరే అని. కన్నీరు తప్ప బతుకును ఏ నీళ్ళు మోయగలవు ? ఓ కవి అన్నట్టు కళ్ళు తడవకుండా జీవితం దాటలేమని, కన్నీరు లేకుండా జీవితం ముందుకు సాగదని. ఇంతటి బరువైన సాంద్రమైన మాటలు ఎంతటి జీవితాన్ని చూస్తె రాయగలం?
-
అన్నీ మరణిస్తాయి లేదా నశిస్తాయి నీరు ఉంటుంది
 అన్నీ విడిపోతాయి కలుసుకోవాలని అలమటిస్తాయి
విడిపోవడం కలుసుకోవడం ఒక్కటే నీటికి// (పు 13)
 నిజమే కదా (ఒక దీర్ఘ నిట్టూర్పు ) మొదట వాన కవిత్వామనుకున్నాను, తరువాత వాన కన్నీరనిపించింది. ఇప్పుడు వాన అనుభవాల సారం అనిపిస్తుంది. నిజమే ఈ మనిషనే కొబ్బరిచెట్టు, అనుభావాల సారంలో కన్నీటితో కవిత్వమై ఓలలాడుతుంది.
-
"వాన గొప్ప నాట్య గురువు "
"నీరు నాట్యం చేస్తుంది "
"నీరు మనిషికి మొదటి అద్దం "
"నీరు బతుకును మోస్తుంది "
"వాన బ్రతుకు నాట్య గురువు " 

అర్ధాలు అడక్కుండా ఆడుకోవడం. జీవితాన్ని అర్ధవంతంగా మొదలుపెట్టి ముగించడం "కళ" కదా ..!! అందుకే ఏ ద్వేషం, కలుషితం అంటని పాపాయిని, కల్మషంలేని నీటిని (కవిత్వాన్ని / కన్నీటిని )అడగమంటున్నాడెమో కవి .
-
అర్ధాలు అడక్కుండా ఆడుకోవదమేలాగో 
అడిగితే పాపాయి నడుగు
లేదా వానచినుకులుగా తనలోంచి తాను
తనలోనికి తాను రాలే నీటిని అడుగు  //

"అమ్మూ" అనే కవిత చదువుతున్నప్పుడు కవి విశ్లేషనాత్మక దృష్టికోణం నన్ను ఆశ్చర్యపరించింది. రెండు లైన్లలోని మాటలతో ఒక మనిషిగా మనిషి చేసే అయిష్టమైన పనిని చెబుతూ
-
నీలా ఉండలేక మేం
నిన్ను మాలా తయారు చేస్తాం // అంటాడు
కల్మషం అంటని పసితనాన్ని, ద్వేషం మోసం తెలియని పాపాయి ప్రాయంలోకి తిరిగి వెళ్ళడం సాధ్యం అవ్వక ఆ పసితనానికి ఎన్నెన్నోనేర్పుతాం. ఎన్నెన్నో కనుక్కోమని అభ్యాసం చేయిస్తాం. అలా తనను తాను కనుక్కొని వలయాల లోపలి  వలయాల్లోంచి జారిపోయే మనసును  గుర్తుకు చేస్తూ అద్దం ముందు నిల్చోబెట్టి నట్టు అనిపిస్తుంది.

తన నుండి తాను విడివడి, తనని తాను జయిస్తూ నడిచేవాడిలా చెప్పకనే చెపుతూ నడిపించే కవిత "చెంచు కుర్రాడు "
-
మర్నాటికి మాయమయ్యే కాసులు కొన్ని
జేబులో పోసుకొని
నా వంతు మోసం నేనూ చేద్దామని
బయల్దేరుతాను //
అంటూ ఒక నిజ స్థితి నుంచి ఓ కుర్రాడిని తనలో చూపిస్తూ కొన్ని తేడాలను విడమర్చి చూపిస్తూ చివరికిలా ముగిస్తాడు. ఆ ముగింపుతో మనల్ని తనతో పాటు కుదిపెస్తాడు.
-
కుర్రాడు వాడి పోతాడు
ఓడిపోతాడు
నా లోపలి బురదలోపలినుంచి
వికసిస్తూనే ఉంటాడు (పు 18)//

ఇక "నిర్ణయం " అనే కవిత. నిర్ణయమే ఫలితం అని చెపుతూ
-
వసంతం ఎప్పుడూ ఉంటుంది

వసంతం ఒక ఋతువు కాదు. అదొక నిర్ణయం //
అంటూ నిర్ణయం తాలూకు ఫలితాలు, ఆ ఫలితాల ప్రభావం స్వీకరించే జీవితంలో కొని కాలాలు చెప్తుంటాడు. అంతే కాదు. ఆ ఫలితాల వల్ల కలిగే పరిణామాలు స్వీకరించే దశల్లో బాధ కలిగితే దిగులేస్తే ఏం చేయమంటాడో కవి చూడండి
-
బాగా దిగులేస్తుందా. అయితే ఎవర్నీ ఏమీ అనకు ఊరికే
కూర్చుని ఒక మంచి పద్యం చదువుకో, పద్యంలో కలిసిపో 
ఆ తరువాత తీరిగ్గా సిగరెట్టు వెలిగించినా వెలిగించకున్నా
నీ ముందొక అద్దం ఉన్నా లేకున్నా నీకు నువ్వు మనోహరంగా కనిపిస్తావు //   
మనోహరంగా కనిపించడమే కాదు. ప్రేమకు మూలం. ప్రేమను ఆశించి పొందే విధానం కూడా ఆయనే చెబుతారు ఇలా.. ఓ పద్యంలో /పద్యంతో కలిసిపోయాక
-
నీ మీద నీకు గొప్ప ప్రేమ పుడుతుంది (నిజమేనండోయ్ ..! హెచ్ ఆర్కే గారి కవిత్వం చదువుతుంటే ఇప్పుడు అదే జరుగుతుంది )
ఆ తరువాత చాచిన కొమ్మల నిండా, కొమ్మలను సుతారంగా నిమురుతూ
వెళ్ళేగాలి నిండా, గాలి అలల మీద కదిలే పొగ మంచు నిండా
పొగమంచు మోసే లేలేత ఉదయం నిండా ప్రేమ ప్రేమ ప్రేమ ..//
నిజమే కదా !ఎవరైనా ఒప్పుకోవాల్సిందే !

ఇక  "నేనూ వాళ్ళు " అనే కవితలో సీతాకోక చిలుకను, తనతో అలాగే ఓ సమూహంతో అనుసంధానించి చెప్పే తీరు అధ్బుతం.

అలాగే "ఆకాశంలోంచి చూడు "అనే కవిత దూరంగా ఉంటున్న తన వారి గురించి తపించి ఓ మనవరాలి కలుసుకోవాలనే తపన వారి నావిష్కరించే అందమైన దృశ్యం. ఆ దృశ్యం ఎలాంటిదో తెలుసా..?! వీసాల గీతలు చెరిపి ఒకరి భుజం మీద ఒకరు చేతులేసుకొని ఒక నక్షత్రం మీద నుంచి ఇంకో నక్షత్రానికి పొద్దున్నే వాహ్యాళికి వెళ్లినట్టు అనే అనన్యమైన దృశ్యాన్ని మన ముందు ఉంచుతాడు.
ఇంత వరకు నేను పేర్కొన్నవి ఆ సంకలనం లోని కొన్ని కవితలు అంటే మొదటి ఓ అయిదు కవితల గురించే. ప్రతి కవిత, కవితలోని ప్రతి పాదం జీవితంలో ముంచి తీసిన పసిమిలా ఉంటుంది.

కవితలే కాదు ప్రతి కవిత్వపుస్తకానికి ముందు మాట ఉన్నట్టే ఈ పుస్తకానికి కూడా ఉంది అయితే.. ఈ ముందు మాటకు ఆయన ఇలా శీర్షిక పెట్టారు " ముందు మాట అనబడు సంజాయిషీ " . కవి సమయం గురించి అలాగే ఎడిటింగ్ గురించి ఆయన తీసుకున్న జాగ్రత్తల గురించి వివరంగా మనకు ఉదహరిస్తారు. ఇవి ముఖ్యంగా కవిత్వం రాయడం మొదలు పెట్టిన వారు తప్పక పాటించాల్సిన విషయాలని ఆయన రాసుకున్న ముందు మాట చదివాక అర్ధమయ్యింది. పత్రికలలో అచ్చైనా మళ్ళీ వాటికి కొన్ని మెరుగులు దిద్ది పుస్తకంగా అందించడం చూస్తె కవిత్వం పట్ల హెచ్ ఆర్కే గారికున్న శ్రద్ధ మనకు అర్ధం అవ్తుంది. ఈ ముందు మాటలోని కొన్ని లైన్లు ఇలా
-
యుగమంటే రెండేళ్ళు , మూడు లేక అయిదేళ్ళు అంతే. కవి ఎప్పుడు ఒకే యుగంలో జీవించలేడు. జీవిన్చాల్సి వస్తే వచ్చి పోతాడు.పోక పొతే ఉంటాడు గాని చచ్చి యుగారంభంలో ఒక సూక్ష్మాణువేదో పుడుతుంది. అదేమిటో దానికే తెలియదు. కవికేమి తెలుస్తుంది ?.కవి ఊరుకోడు శోదిస్తాడు. గోరింత లేని కాగితం ముక్కతో గంటల తరబడి ఆడుకునే పాపాయిలా సూక్ష్మాణువుతో ఆడుకుంటాడు. సూక్ష్మాణువు  పగిలి దాని నుంచి విస్తరించే చుక్కల వెంట పరుగెత్తుతాడు. అది వెదజల్లే అణుధార్మిక శక్తికి గాయపడతాడు. నల్ల బిలాలలో పడి కొట్టుకుంటాడు. గాయాల్ని ప్రదర్శించడు.కవి సిగ్గరి ; వయసెంతైనా వదలని కౌమారం ప్రదర్శిస్తే అందం అనుకున్నవే ప్రదర్శిస్తాడు.యుగం ఎన్నాళ్ళో ఉండదు. రెండేళ్ళు మూడు లేక అయిదు. అప్పటి వరకు తనకు కలిగిన ఆశ్చర్యాలు కవి పద్యాలు. వాటిని ఎవరికో ఇచ్చేసి తానూ ఖాళీ అయిపోవాలి. పుస్తకమైపోయి తనను తాను మరిచిపోవాలి. మళ్ళీ పుట్టడం కోసం చనిపోవాలి. పుస్తకం కావడమంటే చనిపోవడమే. //

అంతే కాదు మరో పేరా తరువాత పై దాన్ని కొనసాగిస్తూ ...

పుస్తకమయిపోవడం అంటే రచయిత చనిపోవడమే ఈ లోపల కొంచెం మరమ్మత్తులకు వీలుంటుంది.పత్రికలో అచ్చయిన పద్యాలతో సహా అన్నింటినీ మరో సారి చదువుకున్నాను. తొందరపాటు అనే దుర్గుణం వళ్ళ జరిగిపోయిన తప్పులు దిద్దుకున్నాను. అత్యధికం రూపానికి సంబందించిన తప్పులు. నాకు పాఠకుడు కావడంలో దొర్లిన వైఫల్యాలు,దరిమిలా పద్యాలు బాగా మారిపోయాయి. ఇప్పుడు మీకు తెలిసిపోయి ఉంటుంది.ముందు మాటను సంజాయిషీ అని ఎందుకన్నానో....

అంటూ ఆయన ఇచ్చిన వివరణలో ఎంత నిజాయితీ. పద్యంలో మమేకమై చనిపోయే స్థితికెళ్ళి బ్రతికి పద్యంలో సజీవమైన రూపాన్ని నిలబెట్టాలనే తపన నాకు ఎంతో నేర్చుకోవాలి అనే సవాలు ముందుంచింది.




















ఈ కవిత్వ సంకలనం అంతా చదివినంత సేపు హృదయాన్ని ఒరుసుకు పోయే నదిలా ఉంటుంది. ఫుంఖానుపుంకలుగా రాసే కవిత్వం, ఎంత సేపుంటుందో తెలియదు కాని ఈ కవిత్వంలోని సజీవ లక్షణం చదివే ప్రతి పాఠకున్ని తనలోకి తాను , తన అనుభవాల దొంతరల్లో దూరి జీవితాన్ని మరో సారి జీవించమని చెబుతున్నట్టు ఉంటుంది .కొత్తగా కవిత్వం రాయడం మొదలు పెట్టినవాళ్ళు చదవాల్సిన ఉత్తమమైన కవి ఆయన కవిత్వం . నా అభిమాన కవులలో ముందు వరుసలో  నిలిపోయిన కవి.

Saturday, September 28, 2013


ఒక తాత్వికత నిండిన కవిత ఎంతగా మనల్ని మౌనం లోకి తీసుకు వెళ్తుంది కదా ..!! అదే జరిగింది నేను ఈ కవిత చదివినప్పుడు. అంతర్జాలంలో ఒక వ్యాసం చదువుతూ, మరి దేనికోసమో శోదిస్తున్నప్పుడు బొల్లోజు బాబా గారి బ్లాగు సాహితీ యానం లోని ఒక అనువాద కవిత కనబడింది. నాకు చాలా నచ్చింది. దానికి శీర్షిక లేదు. అలాంటి కవితలు ఇంకా ఎక్కడ దొరకోచ్చో అని ఆ కవిత మూలం ఎవరో అని వెతికితే "Tao Te Ching " అని ఉంది. ఇది కవి పేరేమో అనుకున్నాను. ఇది కవి పేరు కాదు. "Tao Te Ching " అనే అతి పురాతన చైనా తాత్విక గ్రంధానిది. దీన్ని" Laozi " అనే తాత్విక వేత్త రాసినది. ఇది 604 BC లేదా ఆ మధ్య ప్రాంతంలో లో ఆయన రాసుంటాడు . దీన్ని Frank J. MacHovec అనే ఆయన 1962 లో అనువదించాడు.

మొదట ఆంగ్ల అనువాదం చూద్దాం . అది ఇలా ఉంది
----------------------------------------------
Clay is molded into a vessel
but the ultimate use of the vessel depends upon the part where nothing exists.

Doors and windows are cut out of the walls of a house
but the ultimate use of the house depends upon the parts where nothing exists.

So, there is advantage in using what can be seen, what exists.
And there is also advantage in using what cannot be seen, what is non-existent.

దీన్ని బొల్లోజు బాబాగారు ఇలా తెనుగీకరించారు
------------------------------------------------
మట్టి ముద్దను పాత్రగా మలచు
దాని శూన్యతలోనే
దాని ఉపయోగం ఉంటుంది.

గుమ్మాలు, కిటికీలతో
గృహాన్ని నిర్మించు
దాని శూన్యతలోనే
దాని ఉపయోగం ఉంటుంది.

దేన్నో పొందుతూ ఉంటాం కానీ
దాని శూన్యతనే వాడుకుంటూ ఉంటాం.

-----------------------

బొల్లోజు బాబా గారు :


Wednesday, September 18, 2013




















||కస్తూరి వాహకుడు ||
---------------------
నిద్రపట్టని సమయం , కుండపోతగా కురుస్తున్న వర్షం , చల్ల గాలులతో పాటు వేడిని కడుక్కుంటూ వాతావరణం, అందుకే కాబోలు ఆ చల్లదనం కూడా ఒంటికి హాయినివ్వని స్థితి. ఆ సమయంలో తీసుకున్నాను చదవడానికి "విషాద మోహనం " మళ్ళీ , మళ్ళీ , మళ్లొసారి చదువుతున్నా అంతే కొత్త అర్ధాలతో మాట్లాడుతున్న కవిత్వ పుస్తకం . కొప్పర్తి వెంకట రమణ మూర్తి గారి పై చెరిగిపోని అభిమానాన్ని పెంచిన పుస్తకం . ఒక్కో కవిత ఒక్కో పరిమళం , అలా చదువు
తూ ఒక కవిత దగ్గర ఆగిపోయా " కస్తూరి వాహకుడు " అంటూ కొప్పర్తి గారు బి.వి.వి. ప్రసాద్ గారి గురించి రాసుకున్న కవిత. ఆశ్చర్యం ఆనందం రెండూ వేసాయి. ఆ మధ్య ఎవరో మాట్లాడుతుంటే విన్నా కవులకు , సాహిత్యకారులకు ప్రపంచంలో ఎవరికీ లేనంత అసూయ తోటివాడి మీద అని. అదే సమయంలో బి.వి .వి ప్రసాద్ గారి కవితలను గురించి మరో సారి ఆలోచించి హైకూలతో పాటు ఆయన రచనల్లో ఎంత తాత్వికత ఉందొ గమనించి, గ్రహించినప్పుడు ఏదో తృప్తి. అప్పుడనిపించింది ఎన్ని రాతలు రాస్తేనేం వ్యక్తిత్వం పరిమళ భరితమైనప్పుడు కవిత్వం ఎప్పుడూ , ఎలాంటి మనసునైనా ఆ పరిమళంతో ఉత్తేజ పరుస్తూ ఉంటుందని. ఎంత గొప్ప రచనలైనా హృదయ శుద్ధి లేనిదే రాస్తే అవి టేక్నికల్లీ రచనే అయినా హృదయాన్ని స్పృశించదని.
"విషాద మోహనం " 41 పేజి లో కొప్పర్తి గారు బి వి వి గారి గురించి రాసుకున్న నాలుగు మాటలు
కస్తూరి వాహకుడు
---------------------
అతడు
అప్పుడప్పుడు వచ్చేవాడు
సంశయంగా కవిత్వం వినిపించేవాడు
తర్వాత , తరుచూ వచ్చి
చొరవగా కవిత్వం వెదజల్లెవాడు
ఇప్పుడు రోజూ వస్తాడు
తన కవిత్వాన్ని అలవాటు చేసాడు

వొక్కో రోజూ
ఎప్పటిలానే వచ్చి వెళతాడు
అయితే ఆ రోజూ
కవిత్వం కనిపించలేదని మనకు తెలియదు
------------------ వార్తా - సృష్టి - 24- 10-1998 లో



ఎవరు గొంతెత్తినా 
నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టడానికే
నిశ్శబ్దాన్ని ఎవరు బద్దలు కొట్టినా
కొత్త శబ్దాన్ని ఆవిష్కరించడానికే
కొత్త శతాబ్దాన్ని నిర్మించడానికే

మీరు మీ ప్రపంచాన్ని తూర్పారబట్టి
ఏడు వింతల్ని గుర్తిస్తారు
నేను మీ వింతల్ని జల్లెడపట్టి
నా ప్రపంచాన్ని గుర్తిసాను
(నేను నా వింతలమారి ప్రపంచమూ ..)


కొన్ని రోజుల్ని గుర్తుంచుకోడానికి కాలెండరు పై తేదిని చుట్టు చుడుతాం. లేదంటే డైరీలోనో,పుస్తకంలోనో ఆ పేజిని మడత బెడతాం లేదంటే మరో చిన్న రంగు కాగితం ఓ మూలలో అంటిస్తాం. చదువుతున్న పుస్తకంలో నచ్చిన లైన్లు కనిపిస్తే రంగు పెన్సిల్తోనో లేక స్కెచ్ తోనో మార్క్ చేసుకుంటాం. 


అలాగే ఈ రోజును కూడా కొన్ని ముఖ్యమైన మాటలుదొరికిన పేజిలాగే గుర్తు చేసుకుంటూ నా మస్తిష్కం ఈ రొజును ఇక్కడికి మార్క్ చేసుకుంది. " అలా జీవితంలో కష్టపడి ఎదిగే వాల్లంటే నాకెంతో ఇష్టం" అని తోటివారిని అమూలాగ్రం తెలుసుకుని మంచి ఆత్మీయులు కాగల వ్యక్తిని కలుసుకోవడం సంతోషంగా వుంది. "ఆకాశవాణి స్టూడియోలో ఇప్పుడు సమయం " అన్నా -"ఆకాశవాణి వాతావరణ సమాచారం" అంటూనే రేడియో తరంగాలతో వెనక్కి తీసుకెల్లిన స్వరం. ఆసక్తి, పట్టుదలతో అనుకున్నది సాదించడం మొదలుపెట్టడానికి చేసిన కృషిని పంచుకుంటూనే ఉత్సాహాన్ని నింపిన మాటలతో , నవ్వుతూనే సాహిత్య ప్రపంచంలోని కొన్ని విషయాలను నవ్విస్తూ పంచుకొని , ఒక మంచి పరిచయం జీవితంలో కొన్ని క్షణాలను ప్రభావితం చేసి స్పూర్థి ఇందనం నింపుకోడానికి కొందర్ని దేవుడు అలా మన జీవితాల్లోకి అనుమతిస్తారనుకుంటా. ఇవ్వాల్టి ఈ పేజిని గుర్తుంచుకునేట్టు చేసిన వారు "పైడి శ్రీ"గా పత్రికల ద్వారా పరిచయమై 'తెరేష్ బాబు 'గా ఆకాశవాణి ద్వార సాహిత్యలోకం గుర్తించే వారు.

ఇవాల్టి రోజున పైడి తెరేష్ బాబు సర్ ని కలవడం. ఎన్నో విషయాలు మాట్లాడుకోవడం. స్వయంగా సంతకం చేసి బహూకరించిన పుస్తకాలను అందుకోవడం ఆనందంగా ఉంది.                  

_____________________________________________________


22 జూలై 2013 న ఆకాశవాని కేంద్రంలో తెరేష్ బాబు పైడి గారిని కలిసినప్పుడు
________________________________________________________
తెరేష్ బాబు గారు తన పుస్తకాలను స్వయంగా సంతకం చేసి ఇచ్చినవి
-----------------------------------------------------------------------